మాధవరం సమీపంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి
కర్నూలు, జూన్ 23,ప్రభ మనం,న్యూస్
ముఖ్యమంత్రి పర్యటనకు సంబధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు.మంగళవారం మంత్రాలయం మండలం మాధవరం గ్రామం సమీపంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి గురువారం మంత్రాలయం లో పర్యటించే అవకాశం ఉన్నందున సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమన్వయంతో, ఎటువంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ నిర్మాణ పనులను నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. అలాగే హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు, రవాణా శాఖ అధికారులకు సూచించారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.అనంతరం కలెక్టర్ హెలిప్యాడ్ ప్రాంతం, సభా వేదిక స్థలం, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జి) మధుసూదన్ రెడ్డి, ఆర్. అండ్.బి ఎస్. ఈ మహేశ్వర రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయం ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, తహశీల్దార్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

