శ్వేతపత్రాల పేరుతో ఉద్యోగుల సమస్యలను దాటవేయొద్దు : ఎస్.టి.యు
ఎమ్మిగనూరు, ఆగస్ట్,21,ప్రభ మనం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వెంటనే ఇచ్చిన హామీలను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్.టి.యు) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్.టి.యు ఎమ్మిగనూరు ప్రాంతీయ శాఖ సమావేశము మాచాని సోమప్ప బాలికోన్నత పాఠశాల, ఎమ్మిగనూరు నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ 12వ పి.ఆర్.సి కమిటీ ఏర్పాటు, మధ్యంతర భృతి మంజూరు, ఆర్థిక బకాయిల చెల్లింపు, సిపిఎస్ రద్దు తదితర మేనిఫెస్టో హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ఉద్యోగ, పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉందని, వెంటనే ప్రభుత్వం వైఖరి మార్చుకొని ఆర్థిక అంశాలపై స్పష్టమైన నిర్ణయం వెంటనే ప్రకటించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి, న్యాయమైన వేతన సవరణను అమలు చేయాలి. పెండింగ్లో ఉన్న డీఏలు, సరెండర్ లీవ్, పీఆర్సీ బకాయిలు మరియు ఇతర ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చించిన అంశాలకు కాలపరిమితితో కూడిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. శ్వేతపత్రాల పేరుతో ఉద్యోగుల న్యాయమైన సమస్యలను దాటవేయడం సమంజసం కాదని, గత ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఎలా ఉన్నా, ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోరాదని హితవు పలికారు.సిపిఎస్ సమస్యకు ఉద్యోగ సంఘాలతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. పెన్షనర్ల ఆర్థిక, వైద్య సమస్యలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలి. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి చేసి విద్యా ప్రమాణాలపై దృష్టి పెట్టాలని కోరారు. శ్వేతపత్రం గతాన్ని వివరిస్తుంది; ప్రజలకు ఇచ్చిన హామీల అమలే ప్రభుత్వ పనితీరుకు కొలమానం. ఉద్యోగుల సమస్యలను ఇక వాయిదా వేస్తే రాష్ట్రవ్యాప్త ఐక్య ఉద్యమానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాలకు విస్తృతంగా వినియోగించడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని, ఉపాధ్యాయులను పూర్తిగా విద్యా బోధనకే పరిమితం చేసి, బోధనేతర విధుల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయులలో ఆందోళనకు కారణమైన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించాలని, అందుకొరకు వెంటనే విద్యా హక్కు చట్టంలో 23(1) నిబంధనను సవరణ చేయాలని కోరారు. 1998, 2008 ఎం.టి.ఎస్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 62 సం౹౹ల పదవీవిరమణ వయస్సు అమలు చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోకారి, వెంకటరామి రెడ్డి, అడివెన్న, రామమోహన్ రెడ్డి, మహదేవప్ప, కర్నూలు నంద్యాల జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జనార్ధన్ ఎస్ చంద్రశేఖర్, చిన్న సుంకన్న, అజాంబేగ్ సీనియర్ నాయకులు గోకారి, మహదేవప్ప, ప్రసాద్ రెడ్డి, వెంకటేశ్వర్లు, బసవరాజు, దేవ ప్రసన్న రాజు, రామ్మోహన్ రెడ్డి, నీలకంఠ, ఎల్లప్ప, జగదీష్, చిన్న తిమ్మన్న, అమీర్, తదితరులు పాల్గొన్నారు.

